సోషల్ మీడియాలో ‘ హీరో’ల హంగామా!?

 సోషల్ మీడియా గురించి ఎవ్వరినడిగినా ఇట్టే చెప్పేస్తారు. దాని ఫవర్ అంత ఇంతా కాదు మరి! లక్షల్లో ఉండే ఫాలోవర్స్ మాత్రమే హీరో ఫ్యాన్ స్టామినాను తెలియజేస్తున్నాయి. అందుకే హీరోలు, హీరోయిన్లు నేడు  సోషల్ మీడియాలోకి ప్రవేశించి తమ స్టామినా నిరూపించుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. ఈ రేసులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌, అల్లు అర్జున్ ముందున్నారు.

ఈ  యువ హీరోలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. కుర్ర హీరోలను చూసిన సీనియర్ హీరోలు కూడా లేటైనా లేటెస్ట్‌గా రంగంలోకి దూకుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి యువ హీరోలకు ధీటుగా స్పందిస్తున్నారు. ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.  

ప్రభాస్  తనకున్న క్రేజ్‌తో సోషల్ మీడియాలో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో 14 మిలియన్ల ఫాలోవర్స్‌తో దూసుకెళ్తున్నారు. దక్షిణాది సినీ పరిశ్రమలోనే ప్రభాస్ టాప్ రేంజ్‌లో ఉన్నారు. తన కెరీర్‌లో 20 చిత్రంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు. జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమవుతున్నది. త్వరలోనే మిగిలి ఉన్న సన్నివేశాలను హైదరాబాద్‌లో భారీ సెట్ వేసి చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్‌కు 13.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.  

అల వైకుంఠపురంలో చిత్రం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సుకుమార్‌తో జతకట్టారు. చిత్తూరు జిల్లా నేపథ్యంగా సాగే అక్రమ కలప వ్యాపారం బ్యాక్ డ్రాప్‌గా పుష్ప అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఈ సినిమా కోసం గెటప్ పరంగా అల్లు అర్జున్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంటున్నారు. అలాగే  ఫేస్‌బుక్‌లో మహేష్ బాబుకు సుమారు 8 మిలియన్ల ఫాలోవర్స్, రాంచరణ్‌కు 7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. మిగితా హీరోలకు అంతంతా మాత్రమే ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. సోషల్ మీడియాలో ‘ హీరో’ల హంగామాను చూస్తుంటే అభిమానులకు కాస్త ఊరట కలుగుతుందట మరి!?